ఉత్తరాదివాసులు ఇసుక తుఫాన్ భయంతో వణికిపోతున్నారు. అనూహ్యంగా పెరిగిన ఇసుక తుఫాన్ల కు అకాల వర్షాలు తోడుకోవడంతో అనేక గ్రామాలలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇసుక తుఫానులు, అకాల వర్షాలతో 30 మందికి పైగా చనిపోయారు. పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం సంభవిస్తోంది. గుజరాత్, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి అకాల వర్షాలు, పిడుగుల వాన కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగా ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో 16 మంది, గుజరాత్ లో 9 మంది మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలు, ఇసుక తుఫాన్ కారణంగా రాజస్థాన్ లో ఆరుగురు చనిపోయారు. రాజస్థాన్ లోని అజ్మీర్, చిత్తోర్గఢ్, శ్రీగంగానగర్, కోట, పిలానీ ప్రాంతాల్లో మంగళవారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలులు, వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. బలమైన ఈదురుగాలులు జన జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తుండటంతో ఇరు రాష్ట్రాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.