ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మే 24 నుండి 26 వరకు నిర్వహించనున్న 6వ అమెరికా తెలుగు సంబరాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. డల్లాస్లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఈ వేడుక కోసం ఎన్నో కార్యక్రమాలను సంబరాల కమిటీ నాయకులు సిద్ధం చేస్తున్నారు. ఆటల పోటీలతో పాటు, సాంస్కృతిక కార్య క్రమాలను పెద్దఎత్తున నిర్వ హిస్తున్నారు. అందరినీ ఉత్తేజపరిచే నాట్యప్రదర్శనలు, రుచికరమైన తెలుగు వంటకాలు, ఉత్తమ సాహితీవేత్తలు పాల్గొనే సాహిత్య కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి దాదాపు మూడువందలకు పైగా స్వచ్చంద సేవకులు వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారని, వారి నిరంతర కృషి అభినందనీయమని సంబరాల కన్వీనర్ కిషోర్ కంచెర్ల అన్నారు. 'మనమంతా తెలుగు -మనసంతా వెలుగు' అనే నినాదంతో మూడురోజుల పాటు కన్నులపండువుగా జరగనున్న ఈ సంబరాల్లో సినీ సంగీత విభావరులు, గాయనీ గాయకులు పాటలు హైలైట్ గా నిలవనున్నాయి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి సంగీత విభావరితోపాటు, మనో, ఆర్పీ పట్నాయక్ సంగీత విభావరులు కూడా ఈ సంబరాల్లో ఏర్పాటు చేశారు. కీరవాణి సంగీత విభావరిలో దామినిభాట్ల, మనీషా ఎర్రబత్తిని, మౌనిమ, దీపు, హేమచంద్ర, కాలభైరవ, నోయల్ సీన్, పృథ్వీచంద్ర, సోని కొమండూరి, శ్రీనిధి పాటలు పాడుతున్నారు. ఆర్పి. పట్నాయక్ సంగీత విభావరిలో సత్యయామిని, ప్రసాద్, శ్రీకాంత్, బేబీ పాటలు పాడనున్నారు. మనో సంగీత విభావరిలో ప్రవీణ్, అంజనా సౌమ్య, రతీష్ పాటలు పాడుతారని నిర్వాహకులు తెలిపారు.