విధులకు ఎందుకు ఆలస్యంగా వచ్చావ్ సీఐ జారీ చేసిన మెమోకు ఓ కానిస్టేబుల్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు కానిస్టేబుల్ వివరణ లేఖలో ఇచ్చిన సమాధానం ఏంటి, అది చూసిన సీఐ ఎందుకు షాక్ అయ్యాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. శ్రీధర్ గౌడ జయానగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతీ రోజు ఉదయం 8:30 గంటలకు విధులకు హాజరవు తుంటారు. కాగా ఈ నెల 11వ తేదీన ఆయన విధులకు ఒక గంట ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావో వివరణ ఇవ్వాలని శ్రీధర్కు సీఐ మెమో జారీ చేశాడు. దానికి కానిస్టేబుల్ శ్రీధర్ వివరణ ఇస్తూ ‘సీఐ సార్ మీలా నాకు ఉదయం సుఖసాగర్ ఉడిపి హోటల్లో టిఫిన్.. మధ్యాహ్నాం ఖానావళిలో భోజనం. రాత్రి ఎంపైర్లో డిన్నర్. మిలనోలో ఐస్క్రీం తర్వాత పోలీస్ స్టేషన్పై ఉన్న గదిలో నివాసం లేదు. నాకు వయసు మీద పడిన తల్లిదండ్రులున్నారు. పోలీస్శాఖలో పనిచేసే భార్య.. స్కూలు వెళ్లే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారందరినీ చూసుకోవడం నేను విధులకు హాజరుకావలి. అందుకే స్టేషన్కు రావడానికి ఆలస్యం అయ్యింది. నేను విధుల పట్ల నిర్లక్ష్యంగా ఏనాడు వ్యవహరించలేదు’ అని మెమోకు సమాధానం ఇచ్చాడు కానిస్టేబుల్ శ్రీధర్ గౌడ. ఇది చదివిన సీఐ ఎర్రిస్వామి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన డీఎస్పీ.. కానిస్టేబుల్ శ్రీధర్ గౌడను సస్పెండ్ చేశారు.