టిక్ టాక్ యాప్ను ప్లేస్టోర్ల నుంచి తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలను ఆదేశించింది. చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్ యాప్పై సర్వత్రా అభ్యంతరం వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో దీన్ని నిషేధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మదురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్ మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్టాక్పై నిషేధం విధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ యాప్ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయరాదని మీడియాకు సూచించింది. చిన్న పిల్లలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏప్రిల్ 16లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు మేరకు చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం తాజా ఆదేశాలను జారీ చేసింది.
మద్రాసు హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ టిక్ టాక్ సంస్థ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టేకు నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 22న జరుపుతామని తెలిపింది. థర్డ్ పార్టీ అప్లోడ్ చేసే వీడియోలకు తమల్ని బాధ్యులని చేయడం సబబు కాదని టిక్టాక్ వివరించినట్లు సమాచారం. యువతకు ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన ఈ యాప్ అనతి కాలంలోనే ఎంతో ఆదరణ పొందింది. దీని వల్ల పిల్లల్లో పెడధోరణులు పెరిగిపోతున్నాయని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.