బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఎస్పీ అధినేత్రి.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అయితే, ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. మాయావతిపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. కాగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా మాయావతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యల్లో భాగంగా ఆమెపై ప్రచారంపై రెండు రోజుల పాటు ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా.. ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం సీరియస్ అయిన సంగతి తెలిసిందే.. అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ సీఎం మాయావతి, ఆజంఖాన్, మేనకాగాంధీ ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది. ఇక మాయావతి పిటిషన్ను తోసిపుచ్చిన సందర్భంగా ఎన్నికల కమిషన్.. తన అధికారాన్ని ఇలాగే ఉపయోగించాలంటూ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.