భర్త వారం రోజులుగా షేవింగ్, స్నానం చేయట్లేదన్న కారణంతో 23ఏళ్ల ఓ మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ ఘటన జరిగింది. గతేడాది వీరికి వివాహం కాగా.. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో ఇద్దరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులో ఆమె పేర్కొన్న కారణమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.సింధి కమ్యూనిటీకి చెందిన తన భర్త వరుసగా ఏడెనిమిది రోజులు స్నానం చేయడని, షేవింగ్ చేసుకోవడని దరఖాస్తులో ఆమె పేర్కొంది. శరీరం నుంచి దుర్వాసన వస్తుంటే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటాడని తెలిపింది. అలాంటి వ్యక్తితో తాను ఉండలేనని అందుకే విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు చెప్పింది. ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ అవస్థి దీనిపై మాట్లాడుతూ.. ఆమె బ్రాహ్మణ కమ్యూనిటికీ చెందిన మహిళ అని తెలిపారు. సింధి కమ్యూనిటీకి చెందిన అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుందని.. చిన్న కారణంతోనే విడాకులకు దరఖాస్తు చేసుకుందని అన్నారు. ఇంట్లో వాళ్లు ఎంత వద్దని చెప్పినా.. ఆమె వినలేదన్నారు.