రాష్ట్రంలో మంచి మెజార్టీతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దివంగత నేత ఎర్రన్నాయుడు కుమార్తె, రాజమహేంద్రవరం నగర తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఓటింగ్లో చాలా అవకతవకలు జరిగాయనీ, ప్రతిచోటా తెదేపా కార్యకర్తలు, నాయకులే ఆ విషయాన్ని లేవనెత్తారన్నారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం ప్రజలు తనను ఆదరిస్తారని, గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. పార్టీపై ఉన్న ప్రేమ, తన కుటుంబంపై ఉన్న ప్రేమను ప్రజలు తనపై చూపించారని అన్నారు. ప్రతి వార్డులోనూ ప్రజలు అభిమానంతో తనను ఉక్కిరిబిక్కిరి చేశారని, ఎందుకు వచ్చాననే ఘటన ఒక్కటి కూడా తనకు ఎదురుకాలేదని గుర్తుచేసుకున్నారు. ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలనే తాను ఆలోచిస్తున్నానని, వారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నిలిపే దిశగా ఆలోచిస్తున్నట్టు చెప్పారు.