ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16-20 తేదీల్లో భారత్ పాక్‌పై దాడి చేసే అవకాశం :మహమూద్ ఖురేషీ

international |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2019, 10:21 PM

పాకిస్తాన్‌పై దాడులకు భారత్ మరోసారి సిద్దమవుతోందని పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయ వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని.. ఏప్రిల్ 16-20 తేదీల్లో భారత్ పాక్‌పై దాడి చేసే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఏ ఆధారాలతో ఖురేషీ భారత్‌పై ఈ ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదు. ఇటీవలి పుల్వామా దాడి అనంతర పరిణామాల్లో భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి భారత్ తమపై దాడులకు పాల్పడబోతుందని పాక్ ఆరోపిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
పుల్వామా దాడి తర్వాత పాక్ భారత్‌పై వైమానిక దాడులకు యత్నించగా.. దాడిని తిప్పికొట్టే క్రమంలో ఆ దేశానికి చెందిన F-16 ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత్ పేల్చి వేసింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపెట్టింది. అయితే తాము కూడా భారత ఎయిర్‌క్రాఫ్ట్‌ను పేల్చేశామని ప్రకటించిన పాక్.. ఇప్పటివరకు ఆ ఆధారాలను బయటపెట్టలేకపోయింది. ఇకపోతే బాలాకోట్‌పై భారత్ దాడులు రాజకీయ రంగు కూడా పులుముకున్న సంగతి తెలిసిందే. అసలు నిజంగా భారత్ అక్కడ దాడులు చేసిందా?.. చేస్తే ఎంతమంది చనిపోయారో ఆధారాలు ఎందుకు వెల్లడించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూడటం దారుణమని విమర్శిస్తున్నాయి.  







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com