ఆఫ్రికా దేశం మొజాంబిక్లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఓ మామాడి చెట్టు మీద ఆడబిడ్డకు జన్మనిచ్చిందో మహిళ. ఇడాయ్ తుఫాన్ దెబ్బకు ఆఫ్రికా దక్షిణ తూర్పు తీరం విలవిలలాడిన సంగతి తెలిసిందే. మొజాంబిక్, జింబాబ్వే దేశాల్లోని చాలా ప్రాంతాలు తుపాను తీవ్రతకు చిగురుటాకులా వణికిపోయాయి. తుపాను బీభత్సానికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 5 లక్షల మంది ప్రజలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థలు ప్రకటన జారీ చేశాయి. మొజాంబిక్లోని బీరా తీర ప్రాంతంలో గత గురువారం అర్ధరాత్రి ఇడాయ్ తుపాను తీరం దాటింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 175 కి.మీ.ల వేగంతో గాలులు వీచాయి. మొజాంబిక్తో పాటు జింబాబ్వే, మలావీ ప్రాంతాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఈ తుఫాన్ కారణంగా మోనికా ఏరియాలో దొంబే ప్రాంతానికి ఓ నిండు గర్భిణి... మామిడి చెట్టు మీద ప్రసవించింది.
బిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల తర్వాత చుట్టుపక్కలవారి సాయంతో చెట్టు మీద నుంచి కిందకి దిగి వచ్చింది అమేలియా. సహాయక సిబ్బంది అమేలియాను రక్షించి, పునరావాస శిబిరంలో ఆమెకు ఆహారం, వసతి ఏర్పాటు చేశారు. మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ అధికారిక ప్రకటన ప్రకారం ఇడాయ్ తుఫాను మృతులు 84 గా పేర్కొన్నప్పటికీ... స్వచ్ఛంద సంస్థలు మాత్రం మృతుల సంఖ్య వెయ్యికి పైగా ఉన్నట్లు ప్రకటిస్తున్నాయి. మొజాంబిక్ ప్రభుత్వం ప్రకటనలో తీర ప్రాంతాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొంది. తుపాను తీరం దాటిన బీరా ప్రాంతంలో 90 శాతం ఇళ్లు ధ్వంసం అవగా, 5 లక్షల మంది ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు రెడ్ క్రాస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మొజాంబిక్ దేశంలోని ప్రధాన పట్టణాలన్నింటిలో కమ్యూనికేషన్ల వ్యవస్థ స్తంభించిపోగా, స్థానిక మెడికల్ యూనిట్లలో క్షతగాత్రులు వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.