ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సంతతికి చెందిన ముగ్గురి అరెస్టు

international |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2019, 03:13 PM

 హెచ్‌1-బీ వీసాల దరఖాస్తులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తుల్ని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. కిశోర్‌ దత్తపురం, కుమార్‌ అశ్వపతి, సంతోశ్ గిరి అనే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. వీసా దరఖాస్తులో భాగంగా ఐ-129 అనే పిటిషన్‌ను అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపర్చాలి. అయితే ఈ ముగ్గురు భారతీయులు.. లేని ఉద్యోగాల్ని ఉన్నట్లుగా చూపించి లాభం పొందాలని చూశారని అక్కడి పోలీసులు కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొన్నారు. ఇతర కంపెనీలతో పోటీ పడే క్రమంలో ప్రయోజనం పొందడం కోసమే వారు ఈ పనికి పూనుకున్నట్లు తెలిపారు. 


ఈ క్రమంలో వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి థర్డ్‌ పార్టీలను కూడా ఆశ్రయించినట్లు పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. నానోసిమాంటిక్స్ అనే కంపెనీని స్థాపించి ఐటీ, సాఫ్టవేర్‌ కంపెనీలకు ఉద్యోగులను సమకూర్చే ఏజెన్సీగా వారు నమోదు చేసుకున్నారన్నారు. కానీ నిజానికి వారు విదేశీయులను ఇతర పనుల్లో చేర్చుతున్నారని తెలిపారు. ప్రభుత్వ తనిఖీల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా అభ్యర్థులకు శిక్షణనిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది ఖాతాల్లో డబ్బులు జమ చేసి నకిలీ లావాదేవీలను కూడా సృష్టించారన్నారు. మరోవైపు నిందితులు మాత్రం పోలీసుల ఆరోపణల్ని తోసిపుచ్చారు. నిందితుడు కిశోర్‌ శాంటా క్లారాలో నివాసముంటుండగా.. కుమార్‌ ఆస్టిన్‌లో, సంతోష్‌ శాన్‌జోస్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం మే 13న కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసులో దోషులుగా తేలితే నిందితులకు గరిష్ఠంగా పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,50,000 అమెరికన్‌ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com