జమ్ముకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో పేలుడు సంభవించింది. బనిహల్ ప్రాంతంలో నిలిపి ఉంచిన కారులో ఈ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ఉంది. దీంతో జవాన్లను లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిపారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ కాదని సీఆర్పీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. సిలిండర్ పేలుడు వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుడుపై దర్యాప్తు జరుపుతున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.