ఈసీ స్వతంత్రంగా వ్యవహరించాలని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిష్పక్షపాతంగా ఎన్నికలను జరపాల్సిన బాధ్యత ఆ రాజ్యాంగ వ్యవస్థపై ఉందని ఆయన గుర్తు చేశారు. కుట్రదారుల మాటలు నమ్మి అధికారులను బదిలీ చేయడమేంటని ప్రశ్నించారు. ఓ సందర్భంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్నికల్లో భాగం కాదని వ్యాఖ్యానించిన ఈసీ.. ఇప్పుడు ఏపీ నిఘా విభాగాధిపతిని బదిలీ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఫారం-7 దరఖాస్తులు పెట్టింది తానేనని బహిరంగ సభలో జగన్ ఒప్పుకున్నారని, దీనిపై మేం ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఫారం-7 పేరుతో నకిలీ దరఖాస్తులు చేసిన వైకాపా నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫిర్యాదులు వస్తే అధికారుల వివరణ తీసుకోకుండా ఎలా చర్యలు తీసుకుంటారని దినకర్ నిలదీశారు. పనిచేస్తున్న అధికారులను వైకాపా చెప్పిందని బదిలీలు చేయిస్తారా అని ప్రశ్నించారు. వివేకా హత్యపై సిట్ నివేదిక వెలువడే సమయంలో అధికారి బదిలీ చేయడం సబబేనా? అన్నారు. భాజపా పాలిత ఝార్ఖండ్లో ఇంటిలిజెన్స్ డీజీ ఎమ్మెల్యేల కొనుగోలులో పట్టుబడినా చర్యల్లేవని దినకర్ గుర్తుచేశారు.