`నేను అందరివాడిని..అందరికీ అందుబాటులో ఉండేవాడిని. కుప్పం నియోజకవర్గం నుంచి కార్యకర్తలు వచ్చి నేరుగా ముఖ్యమంత్రిని కలిసి వెళతారు. తమ గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు, పథకాలు అడిగి మరీ తీసుకుంటారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలూ ఎప్పుడైనా నన్ను కలవొచ్చు. మీ సమస్యలు ఏమున్నా పరిష్కరించే బాధ్యత నాది`` అంటూ భరోసా ఇచ్చారు మంత్రి నారా లోకేశ్. గురువారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని కొలనుకొండ,వడ్డేశ్వరం,ఇప్పటంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోటు బడ్జెట్లో రాష్ర్టం ఉన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. మంగళగిరికి అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు పక్క రాష్ర్టం ముఖ్యమంత్రి జగన్కు వేలకోట్లు డబ్బులతోపాటు, ప్రచారరథాలు పంపిస్తున్నారని ఆరోపించారు. జగన్ తనను సీఎం చేయాలని కోరుతున్నారని, అక్రమాస్తుల సంపాదన, జైలుకెళ్లిన అనుభవాలు చూసి సీఎంని చేయాలా? అని ప్రశ్నించారు. మంగళగిరి ప్రజలు తమ బాగోగులు చూస్తారని ఎన్నుకున్న ఎమ్మెల్యే దొంగబ్బాయి జగన్తో కలిసి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఇప్పటివరకూ 275 కేసులు వేశారని చెప్పారు. ఏనాడైనా మీ ఊరు రాని ఆయనను ఓడించి బుద్ధి చెప్పాలని లోకేశ్ పిలుపునిచ్చారు. గ్రామాలలో సమస్యలన్నీ తనకు తెలుసునని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.