ఈ తెల్లవారుజామున ఐఏఎఫ్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత అందరి కళ్లూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైనే ఉన్నాయి. ఈ రోజున ప్రధాని అందరికీ మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇస్కాన్ మందిరంలో నిర్వహిస్తున్న గీతా ఆరాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మెట్రోలో ప్రయాణించారు. 670 పేజీలు, 800 కిలోల బరువైన అతి భారీ భగవద్గీత ఆవిష్కరణకు ప్రధాని వెళ్తున్న వీడియో ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
వయొలెట్ లైన్ లోని ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్ లో ప్రధాని మోడీ మెట్రో రైలు ఎక్కారు. కోచ్ లోపల ప్రధాని ఆ మార్గంలో రోజూ ప్రయాణించేవారితో మాట కలిపారు. వారు మోడీతో సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీ పడ్డారు. తన ప్రయాణంలో పక్కన కూర్చున్న కొందరు చిన్నపిల్లలతో కూడా ఆయన ముచ్చట్లాడారు. తర్వాత ప్రధాని నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ లో దిగారు. ప్రధాని ప్రయాణించిన మార్గం అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు.