ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీసీకి బీసీసీఐ లేఖ

national |  Suryaa Desk  | Published : Thu, Feb 21, 2019, 12:11 PM

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ శశాంక్ మనోహార్‌ను సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ డ్రాప్ట్ నోట్‌ను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్‌ను వరల్డ్‌కప్ నుంచి నిషేధించపోతే వరల్డ్‌కప్ నుంచి తామే తప్పుకుంటామని ఆ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడకపోతే ఎదురయ్యే సమస్యలపై బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ లీగల్ కన్సల్టెంట్లతో గురువారం చర్చించేందుకు సిద్ధమయ్యారు. సీఓఏ వినోద్ రాయ్ అనుమతితోనే బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ ఈ డ్రాప్ట్ నోట్‌ని తయారు చేశారు.


పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్న బీసీసీఐ తాజాగా మెగా టోర్నీ నుంచే ఆ జట్టుని తప్పించేందుకు పావులు కదిపే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 27న దుబాయి వేదికగా జరిగే ఐసీసీ సమావేశాన్ని ఉపయోగించుకోనుంది.భారత్-పాక్ మ్యాచ్‌ని నిర్వహించాలా? వద్దా? అనే దానిపై దుబాయి వేదికగా ఫిబ్రవరి 27న జరిగే సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్చించనుంది. వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తుండటంతో దీనిపై ఐసీసీ దృష్టి సారించింది.ఈ మీటింగ్‌తో పాక్‌తో మ్యాచ్‌పై ఆడే విషయంపై బీసీసీఐ కూడా స్పష్టత ఇవ్వనుంది. "భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై బీసీసీఐ పాలకుల కమిటీ వెంటనే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఆదేశిస్తే? అప్పుడు వేగంగా బోర్డు నిర్ణయాన్ని అమలు చేసే వీలుంటుంది" అని బీసీసీఐ సెక్రటరీ నిరంజన్ షా అన్నారు.


మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ప్రారంభమవుతుండగా జూన్ 16న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాపోర్డ్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తుండటంతో దీనిపై ఐసీసీ దృష్టి సారించింది.మరోవైపు బీసీసీఐ సైతం పాక్‌తో మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయానికి సూచన ప్రాయంగా వచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ ఆడేందుకు అంగీకరించకపోయినా... మ్యాచ్‌లో పాల్గొనక పోయినా పాక్‌కు పాయింట్లు దక్కే అవకాశం ఉంది. భారత్‌-పాక్‌ జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com