మన దేశ సాంకేతికతతో చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేసిన వందే భారత్ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలుగా ఈ ట్రైన్ గుర్తింపు పొందింది. అయితే ‘వందే భారత్’ పై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక విండో గ్లాస్ పగిలిపోయింది. ఉత్తరప్రదేశ్లోని తుండ్లా ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి జరిగిన సమయంలో ట్రైన్ కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. కాగా, ట్రయల్ రన్ సందర్భంగా వందే భారత్పై గతంలో కూడా కొందరు ఆకతాయిలు రాళ్ల దాడికి దిగిన దాఖలాలున్నాయి.
డిసెంబర్ 20, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈ ఘటనలు జరిగాయి. ఇదిలాఉండగా.. ప్రధాని చేతుల మీదుగా ఢిల్లీలో గత శుక్రవారం ప్రారంభమైన వందే భారత్కు ఆదిలోనే సమస్యలు ఏర్పడ్డాయి. ప్రారంభమైన మొదటి రోజున ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన ఈ రైలు తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్యతో తుండ్లా జంక్షన్ వద్ద నిలిచిపోయింది. పట్టాలను దాటుతున్న పశువులపై ఈ రైలు దూసుకెళ్లడంతో చక్రాలు పక్కకు జరిగాయని పశ్చిమ రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ తెలిపారు.