శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింతగా అభివృద్ధి చేయాలని టిటిడి జెఈవో బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో ఆదివారం సాయంత్రం జెఈవో టిటిడి, ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరుకు విచ్చేసే భక్తుల సంఖ్యను పెంచాలని, అందుకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. భక్తులు తిరుమలలో శ్రీభూవరహాస్వామివారు, శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారిని దర్శించుకుంటే యాత్ర సంపూర్ణమవుతుందని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. అందుకు అనుగుణంగా స్థల పురాణం తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.
తిరుచానూరులో ట్రాఫిక్కు ఇబ్బందిలేకుండా రూ.1.2 కోట్లతో ఎస్బిఐ ఎటిమ్ నుండి జిల్లా పరిషత్ పాఠశాల వరకు సిమెంటు రోడ్డును ఏర్పాటు చేయడం, రూ.10 లక్షలతో ఘంటసాల విగ్రహం నుండి రోడ్డు వెడల్పు, రూ.30 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పార్కింగ్ను అభివృద్ధి చేయాలన్నారు. అదేవిధంగా ఫ్రైడే గార్డెన్స్ ముందు రూ.81 లక్షలతో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.50 లక్షలతో ఆస్థాన మండపం మరియు ఫ్రైడే గార్డెన్స్ వద్ద షల్టర్ నిర్మాణంపై చర్చించినట్లు వివరించారు. ఆస్థాన మండపం వద్ద భక్తులకు కల్పించవలసిన ఇతర సౌకర్యాలపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ చంద్రశేఖర్రెడ్డి, ఎస్టేట్ అధికారి పార్థసారధి, ఇఇ సత్యనారాయణ, డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.