తాను ఎన్నటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. అవసరమైతే రాజకీయాలనైనా వదులుకుంటాను కానీ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలో ఓ పాఠశాల ఎక్స్ పో ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో ముచ్చటించారు. తాను టీడీపీతోనే ఉంటానని పదే పదే చెప్పినా సోషల్ మీడియాలో తనపై వదంతులు వస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యర్థుల ప్రకటనలపై ప్రశ్నించగా.. తాను స్థాయికి తగ్గి మాట్లాడబోనని పేర్కొన్నారు. తెదేపా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పార్టీ తనను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని వెల్లడించారు. పోటీలో లేకున్నా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క బీసీ నాయకుడు కూడా జిల్లా అధ్యక్షుడిగా లేరని, అలాంటి వారు బీసీ గర్జన నిర్వహించడం విడ్డూరంగా ఉందని గంటా శ్రీనివాసరావు ఎద్దేవాచేశారు.