జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు చాలా మంది కదిలి వస్తున్నారు. తమకు తోచినంత సాయం చేసి సహృదయతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు తమవంతుగా సాయం చేయడానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. జవాన్ల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధామూర్తి అన్నారు.
గత గురువారం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 49 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశం యావత్తు అమరులు కుటుంబాలకు అండగా వుండేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వారి పిల్లల చదువు బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. నటి సుమలత ఓ జవాన్ కుటుంబానికి అర ఎకరం భూమి ఇస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తన సొంతంగా రూ.25 లక్షలు ప్రకటించారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ సైతం ముందుకు వచ్చింది.