టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తన సేవా గుణాన్ని మారోసారి చాటుకున్నారు. జమ్మూకశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ అమరవీరుల పిల్లలను చదివించే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. తాను స్థాపించిన సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో అమర జవానుల పిల్లలందరికీ ఉచితంగా విద్యను అందిస్తానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘పుల్వామాలో అమరులైన సీఆర్పీఎఫ్ వీర జవానుల కోసం మనం ఎంత చేసినా తక్కువే! కానీ కనీసం నా వంతుగా వారి పిల్లలను చదివించే పూర్తి బాధ్యతను తీసుకుంటా. నా ‘సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్’లో వారికి విద్యను అందజేస్తాను’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు.
సెహ్వాగ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు అందరూ ప్రశంసిస్తున్నారు. సెహ్వాగ్ బాటలోనే మరెందరో ప్రముఖులు వీర జవాన్ల కుటుంబాలకు బాసటగా నిలవడానికి ముందుకు వచ్చారు. హర్యానా పోలీస్ శాఖలో పనిచేస్తోన్న స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యక్తిగతంగా రూ.25 లక్షల సాయం అందించారు. వీరు మాత్రమే కాదు.. దేశంలోని ప్రతి సామాన్యుడు తనవంతు సాయంగా ఎంతో కొంత విరాళం అందజేస్తున్నాడు. కాగా, ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందగా.. తీవ్రంగా గాయాలపాలైన కొంత మంది సైనికులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.