ఎవరికైనా డబ్బులు కావాలంటే.. ఏటీఎం మెషీన్లో కార్డు ఉంచి పిన్ నంబర్ ఎంటర్ చేసి.. కావాల్సిన డబ్బులు తీసుకుంటాం. అయితే ఆ పిన్ నంబర్ మర్చిపోయినా.. అపరిచితులకు ఆ నంబర్ తెలిసినా సమస్యలు తప్పవు. అందుకోసం బ్యాంకులు చాలా భద్రతా ఏర్పాట్లు చేశాయి. కొన్ని బ్యాంకులు మనుషుల వేలిముద్రల ఆధారంగా డబ్బు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కానీ స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో ఉన్న ఓ బ్యాంకు డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం కేంద్రాల్లో వినూత్నమైన ఏర్పాటు చేసింది. ఏంటంటే మన ముఖాన్ని గుర్తుపట్టి డబ్బులు ఇచ్చే నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా డబ్బులు ఇచ్చే ఏటీఎం ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం. అక్కడి కెయిక్సా బ్యాంకు ఈ టెక్నాలజీని తీసుకుని వచ్చింది. దీనిద్వారా మన డబ్బు ఎంతో భద్రంగా డ్రా చేసుకోవచ్చని బ్యాంకు చైర్మన్ జోర్డీ గాల్ తెలిపారు. ఏటీఎంలోని కెమెరా మన ముఖంలోని దాదాపు 16 వేల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మనకు డబ్బు ఇస్తుందట. అంతేకాదు నిరక్షరాస్యులు కూడా చాలా సులభంగా ఈ ఏటీఎంల ద్వారా డబ్బును తీసుకోవచ్చు. ఈ ఏడాది చివరికి బార్సిలోనా పట్టణంలో అన్ని ఏటీఎం కేంద్రాల్లో ఈ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు కెయిక్సా బ్యాంకు సీఈవో గొంజాలో చెబుతున్నారు.