గురువారం జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో చోటు చేసుకున్న ఉగ్రదాడి తరువాత సరిహద్దుల్లో వేగంగా యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తోన్న జైషె మహమ్మద్ ఉగ్రవాదులే ఈ దాడికి కారణమని, ఆ దేశంపై మరోసారి యుద్ధానికి దిగాలంటూ దేశ ప్రజలు నినదిస్తున్న తరుణంలో.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటోంది. మనదేశ వైమానిక దళం పాకిస్తాన్ సరిహద్దు అయిన పోక్రాన్లో ఐదు గంటలపాటు వైమానిక దళ విన్యాసాలను నిర్వహించి సత్తా చాటింది. ఈ కార్యక్రమంలో వైమానికదళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా పాల్గొన్నారు. వైమానిక దళం ఆధీనంలో ఉన్న 140 రకాల యుద్ధ విమానాలను ఇందులో ప్రదర్శించారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సహా రక్షణ శాఖకు చెందిన పలువురు కీలక అధికారులు ఈ విన్యాసాలను వీక్షించారు. గౌరవ గ్రూప్ కెప్టెన్గా నియమితుడైన మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ దీనికి హాజరయ్యారు. అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ల రకానికి చెందిన ఆకాశ్ వైమానిక విన్యాసాల్లో తమ సత్తా చాటడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమయ్యామని, కేంద్రం నుంచి సంకేతాలు అందడమే తరువాయి అని ఆయన అన్నారు. తమ శక్తిని చాటడం కోసమే ఈ యుద్ధ విన్యాసాలను చేపట్టామని ధనోవా తెలిపారు. పగలు, రాత్రి అనే తేడా తమకు లేదని, లక్ష్యం ఎంత కఠినమైనా ఛేదించి తీరుతామని ఆయన వెల్లడించారు. లక్ష్యాన్ని ఛేధించడమే తమ పని అని చెప్పారు. యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమయ్యామని తమ శతృదేశానికి తెలియజెప్పడానికే తాము ఈ విన్యాసాలను చేపట్టినట్లు వెల్లడించారు. ఎప్పుడు? ఎలా? ఆరంభించాలనే విషయంపై తమకు పూర్తి స్పష్టత ఉందని, కేంద్రం నుంచి సానుకూల సంకేతాల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.