నటనలోనే కాదు ఉన్నతమైన వ్యక్తిత్వంలోనూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ టాప్ ప్లేస్లో ఉంటారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి అమితాబ్ ముందుకు వచ్చారు. అమరుల కుటుంబాలకు రూ.2.5 కోట్లు ఇవ్వనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్విట్టర్లో ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు సమాధానంగా ఈ విరాళాన్ని ప్రకటించారు. 40 కుటుంబాలకు రూ. 2కోట్లు ఇవ్వనున్న అమితాబ్ అని ఆ నెటిజన్ ట్వీట్ చేయగా... రూ.2.5 కోట్లు అంటూ ట్వీట్ చేశారు. అమరులైన జవాన్లు 49 అని.. తాను 50మందికి ఇస్తున్నానని.. మొత్తం రూ. 2.5 కోట్లని చెప్పారు. అయితే అంతకు ముందు 40 మంది జవాన్ల కుటుంబాలకు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున రూ.2కోట్లు ఇవ్వడానికి అమితాబ్ సిద్ధమయ్యారంటూ.. ఆయన అధికార ప్రతినిధి మీడియాకు తెలియజేశారు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి అమితాబ్ హాజరవ్వాల్సి ఉండగా.. ఉగ్రదాడి నేపథ్యంలో తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.