టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా అందించే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేశాడు. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన కోహ్లీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అవార్డుల కార్యక్రమం నిర్వహించడం సరికాదని భావించి దానిని వాయిదా వేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ భాగస్వామ్యంతో విరాట్ కోహ్లీ ఫౌండేషన్ అందించే ఈ అవార్డుల కార్యక్రమం నేడు జరగాల్సి ఉండగా దానిని వాయిదా వేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ వైపు తీవ్ర నష్టం జరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్టు కోహ్లీ పేర్కొన్నాడు.