పాకిస్థాన్ మరోసారి తన కపటబుద్ధిని ప్రదర్శించింది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు చనిపోగా మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ దాడిపై తొలుత మౌనం వహించిన పాకిస్థాన్ ఇప్పుడు తనకేమీ తెలియదంటూ నంగనాచి వేషాలు వేస్తోంది. జమ్మూ కశ్మీర్లో నిత్యం ఏదో ఒక అలజడి సృష్టించాలని తహతహలాడే పాకిస్థాన్.. ఇప్పుడు మాత్రం జమ్మూలో జరుగుతున్న ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు మొసలి కన్నీరు కారుస్తోంది. దాడి ఘటనతో తమకేమీ సంబంధం లేదని చెబుతున్నప్పటికీ అదంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఎందుకంటే దాడి చేసింది తామేనని ఇప్పటికే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. ఇది పాకిస్థాన్లోని కరాచీ కేంద్రంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ. దీనికి పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ సంస్థ ఐ.ఎస్.ఐ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. తన దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థే దాడి చేశామని ప్రకటించినప్పటికీ పాకిస్థాన్ మాత్రం తమకేమీ పాపం తెలియదంటూ అంతర్జాతీయ సమాజం ముందు వేషాలు వేస్తోంది. పాకిస్థాన్ పాత్ర ఉన్నట్లు గుర్తించేందుకు అవసరమైన కీలకపత్రాలు, ఫోన్, వీడియో సంభాషణలను భారత్ గుర్తించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్కుమార్ ప్రకటించారు. త్వరలోనే వాటిపై దర్యాప్తు సంస్థల పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నాయి.
ప్రధాన సూత్రధారి కమ్రాన్?ఉగ్రదాడికి సూత్రధారిగా పాకిస్థాన్కు చెందిన కమ్రాన్ సూత్రధారిగా వ్యవహరించాడని భారత్ భావిస్తోంది. అతని పథకం ప్రకారమే దాడి జరిగినట్లు తెలుస్తోందని అధికారులు ప్రకటించారు. ఇతన పాకిస్థాన్కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుతం ఇండియాలోనే మకాం వేశాడు. జైషే మహ్మద్ సంస్థ కార్యకాలపాలను ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నాడు. దక్షిణ కశ్మీరులోని పుల్వామా, అవంతిపురా, త్రాల్ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ఇతని ద్వారానే జైషే మహ్మద్ నిర్వర్తిస్తోంది. అలాగే జమ్మూలోని మిధుర ప్రాంతంలోనే మరో దాడి చేసేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు యువకులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి.
పాక్ ఆర్థిక వ్యవస్థకు దెబ్బమరోవైపు ఉగ్రదాడి తర్వాత అత్యంత ప్రాధాన్య దేశాల జాబితా నుంచి పాకిస్థాన్ను భారత్ తొలగించింది. దీంతో తమ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన పాకిస్థాన్ ఆచితూచి స్పందిస్తోంది. ఉగ్రదాడిపై మాత్రం తమకు సంబంధం లేదని చెబుతుండగా.. ప్రాధాన్య హోదా తొలగింపు మాత్రం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం అంటూ చెబుతోంది. ఈ నిర్ణయంతో దాదాపు 14వేల కోట్ల వర్తకలావాదేవీలపై ప్రభావం పడనుంది. దీనివల్ల బారత్కు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. కొన్ని వస్తువుల దిగుమతి ఆగిపోతుంది. అదే సమయంలో అసలే అంతంత ఆర్థిక వ్యవస్థతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్కు భారత్ తీసుకున్న నిర్ణయంంతో గట్టి దెబ్బ తగలనుంది.