ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర జవాన్‌ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున‌ ఏపి ప్ర‌భుత్వం సాయం

national |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 02:54 PM

పుల్వామా దాడిలో అమరులైన ఒక్కొక్క అమర జవాన్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున సాయాన్ని సిఎం చంద్రబాబు ప్రకటించారు. శనివారం ఉదయం సిఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌ పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరమన్నారు. మానవ సమాజంలో ప్రాణాలను బలి తీసుకునే ఈ తరహా దారుణాలు దుర్గార్గమని, అత్యంత హేయమని పేర్కొన్నారు. జరిగిన దారుణంలో 40 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం గుండె చెదిరే విషాదమని ఆవేదన చెందారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మున్ముందు మరెప్పుడూ ఇలాంటి ఘోరం జరగకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని సిఎం సూచించారు. అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.


 భారత సైనికులు నిరంతరం ఈ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాన వేసుకుని అహర్నిశలూ అప్రమత్తంగా ఉంటూ.. తమ విధులను నిర్వర్తిస్తున్నారని, ప్రజల కుటుంబాలను రక్షిస్తున్నారని, ప్రాణాలను సైతం ఫణంగా నిలిపి తెగువ చూపుతూ ప్రజలందరిలో స్ఫూర్తిని నింపుతున్నారని ఉద్ఘాటించారు. పుల్వామా దాడిలో ఒక్కరు, ఇద్దరు కాదు.. 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు అందరూ అండగా నిలవాలని, ఆ వీర జవాన్ల కుటుంబాలకు నైతిక స్థైర్యాన్ని అందించడం అందరి తక్షణ కర్తవ్యమని పిలుపునిచ్చారు. సైనికుల జీవితాలు వెలకట్టలేనివని, వారి కుటుంబాలకు సహకారం అందించాల్సిన బాధ్యతను విస్మరించకూడదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పుల్వామా ఘాతుకానికి నిరసన తెలియచేస్తున్నారని చెప్పారు. ఒక్క గొంతుకగా నిలిచి అమరుల కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారన్నారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఒక్కొక్క అమర జవాన్‌ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం చంద్రబాబు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com