ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నతండ్రికి కడసారి కన్నీటి సెల్యూట్‌

national |  Suryaa Desk  | Published : Sat, Feb 16, 2019, 02:07 PM

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పార్థివ దేహాలు స్వస్థలానికి చేరుకుంటున్నాయి. ముష్కరుల చేతిలో బలైన వీర జవాన్లకు యావత్‌ దేశం కన్నీటి వీడ్కోలు పలుకుతోంది. కుటుంబసభ్యులు, బంధువుల అశ్రు నయనాల మధ్య అమర జవాన్లకు వారి వారి స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.డెహ్రాడూన్‌కు చేరుకున్న సీఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ మోహన్‌లాల్‌ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మృతదేహానికి మోహన్‌లాల్‌ కుమార్తె కడసారిగా సెల్యూట్‌ చూసింది. కన్నీటిని దిగమింగుకుని ఆమె సెల్యూట్‌ చేసిన తీరు అక్కడివారిని కలిచివేసింది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల నేతలు మోహన్‌లాల్‌కు నివాళులర్పించారు.


ఉత్తరప్రదేశ్‌లోని తిర్వా కన్నౌజ్‌ ప్రాంతంలో జవాను ప్రదీప్‌ కుమార్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వేల సంఖ్యలో స్థానికులు ఈ అంతిమయాత్రలో పాల్గొని ప్రదీప్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. బిహార్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లు రతక్‌ కుమార్‌ ఠాకూర్‌, సంజయ్‌ కుమార్‌ సిన్హా పార్థివ దేహాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com