తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారంతో వైకాప అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ లో ఆస్తులున్న వారిపై బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ సారి తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక చివరి నిమిషం వరకు సాగదీయబోమని, సరైన సమయంలో ప్రకటించుకుంటూ ముందుకు వెళతామని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పిన అన్ని అంశాలను నెరవేర్చామని ఆయన స్పష్టంచేశారు. ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు పార్టీ యంత్రాంగం కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.