అందరూ ఊహించినట్టుగానే జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం సైనా నెహ్వాల్, పీవీ సింధులు పోటీపడుతున్నారు. ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉండడంతో శనివారం జరిగే ఫైనల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఇద్దరిలో ఎవరు ఒత్తిడిని జయిస్తారో వారే టైటిల్ విజేతగా నిలవనున్నారు. గతేడాది కూడా వీళ్లిద్దరే ఫైనల్లో తలపడగా.. సైనా విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో పీవీ సింధు 21–10, 22– 20తో అష్మిత చాలిహ (అస్సాం)పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలి గేమ్ను త్వరగానే కోల్పోయి అస్మిత.. రెండో గేమ్లో మాత్రం సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. మరో సెమీస్లో సైనా నెహ్వాల్ 21–15, 21–14తో వైష్ణవి భాలే (మహారాష్ట్ర)పై గెలిచింది.
గతేడాది జాతీయ చాంపియన్షిప్ ఫైనల్లో (2018) సింధుపై సైనా గెలిచింది. ఇంతకుముందు సైనా 2006, 2007లలో కూడా ఈ టైటిల్ను సాధించింది. ఇక సింధు 2011, 2013లలో జాతీయ చాంపియన్గా నిలిచింది. 'సైనాతో ఫైనల్ మరో మ్యాచ్ లాంటిదే. ఈ మ్యాచ్ ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి ఉపయోగపడుతుందని అనుకోవట్లేదు. అత్యుత్తమ ప్రదర్శన చేసి టైటిల్ గెలవడమే నా లక్ష్యం' అని సింధు తెలిపింది.