అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. షికాగోలో ఓ ఉన్మాది జరిపిన కాల్పులకు ఐదుగురు బలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఉన్మాదిని కాల్చి చంపేశారు. చికాగోకు 40 కిలోమీటర్ల దూరంలో గల అరోరా ప్రాంతంలోని హెన్రీ ప్రాట్ అనే పైపులకు వాల్వ్ తయారు చేసే కంపెనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని గ్యారీ మార్టిన్(45)గా గుర్తించిన పోలీసులు, అతడు కూడా అదే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.