2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగదలచిన ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాదాసు గంగాధరం, అర్హంఖాన్, పి.హరిప్రసాద్, మహేందర్రెడ్డిలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచే అభ్యర్ధుల బయోడేటాల పరిశీలన ప్రక్రియ ప్రారంభించారు. దశమి మంచి రోజు కావడంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఆశావహులు జనసేన పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు బరిలోకి దిగే ఆశావహుల సంఖ్య వందల సంఖ్యలో ఉండడంతో పార్టీ కార్యాలయం ఉదయం నుంచే కిటకిటలాడింది. స్క్రీనింగ్ కమిటీ ప్రతి ఒక్కరి దరఖాస్తును సునిశితంగా పరిశీలిస్తూ, పార్టీ అధినేత పవన్కళ్యాణ్ గారి సూచనలకి అనుగుణంగా తన పనిని కొనసాగిస్తోంది.