అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్ షైర్ మీడియా 2018 సంవత్సరానికి తాము ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు కు సింగరేణి కాలరీస్ కంపెనీ ని ఎంపిక చేశారు. ఈ అవార్డును మార్చి 8, 2019 న ముంబై లీలా హోటల్ లో జరిగే కార్యక్రమం లో ప్రధానం చేయనున్నారు. ఈ అవార్డు స్వీకరణకు రావలసిందిగా సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ ను బెర్క్ షైర్ మీడియా సీఈఓ హేమంత్ కౌశిక్, వైస్ ప్రసిడెంట్ ఎమిలీ వాల్ష్ ఆహ్వానించారు. బెర్క్ షైర్ సంస్థ ప్రతి ఏడాది భారతదేశం లో గల కంపెనీ ల పనితీరును, వృద్ధిని స్వచ్ఛందంగా అధ్యయనం చేసి, అత్యుత్తమ కంపెనీ ని ఇండియా స్ బెస్ట్ కంపెనీ గా ఎంపిక చేసి అవార్డు ను బహుకరిస్తున్నారు . గతంలో ఈ అవార్డుకు ఎంపికైన ప్రముఖ సంస్థల్లో ఎల్ అండ్ టీ, హిందూస్తాన్ లివర్, రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా స్టీల్, ఓఎన్ జీసీ, ఇండియన్ ఆయిల్ కంపెనీ తదితర భారత దిగ్గజ సంస్థలు ఉన్నాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ, ఎదుగుతున్న కంపెనీ గా, భారత ఆర్థిక ప్రగతికి తన విశిష్టమైన అభివృద్ధి ఆలోచనలతో దోహదపడుతున్న సంస్థగా గుర్తించి సింగరేణి కాలరీస్ కంపెనీ ని ఎంపిక చేశామని బెర్క్ షైర్ మీడియా తన లేఖలో పేర్కొంది.