జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను ఉగ్రవాదిగా గుర్తించాలని ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. పుల్వామాలో జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన లేఖలో పేర్కొంది. ఈ దాడికి పాల్పడిన జైషే మహ్మద్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న మసూద్ అజర్ కు పాకిస్థాన్ పూర్తి స్వేచ్చనిచ్చి, భారత్ లో ఇతర ప్రాంతాల్లో దాడులు చేయడానికి సహకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 167 ఆంక్షల కమిటీ కింద మసూద్ అజర్, ఇంకా మరికొందరిని ఉగ్రవాదులుగా గుర్తించేందుకు మద్దతు ఇవ్వాలని ప్రపంచదేశాలకు భారత్ విజ్ఞప్తి చేసింది.
మరోవైపు పాకిస్ధాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థ తన వార్షిక నివేదికలో తెలిపింది. ఈ నివేదికను మంగళవారం నాడే యూఎస్ కాంగ్రెస్ ముందు ఉంచింది. అలాగే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హిందూ జాతీయవాద రాజకీయాలకు పాల్పడితే మతహింస చెలరేగే ప్రమాదముందని కూడా అమెరికన్ ఇంటలిజెన్స్ తన నివేదికలో తెలిపింది.