పుల్వామా ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 30 కి చేరుకున్నది. మరో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 45 మంది జవాన్లకు గాయాలయ్యాయి. దేశంలోనే అతి పెద్ద ఉగ్ర దాడి ఘటన అని సీఆర్పీఎఫ్ పేర్కొన్నది. గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించామని సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్ తెలిపారు. ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు వెళ్లారని, విచారణ జరుగుతోందన్నారు. ఈ ఘటనతో కేంద్ర హోం మంత్రి రాజ నాథ్ సింగ్ రేపటి పాట్నా పర్యటనను రద్ధు చేసుకున్నారు. శుక్రవారం ఆయన జమ్మూ కాశ్మీర్ లో పర్యటించి, దుర్ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు. తరువాత మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లను పరామర్శిస్తారు. దాడి జరిగినట్లు సమాచారం అందిన వెంటనే హోం మంత్రి రాజ నాథ్ సింగ్ సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ దుర్ఘటనతో జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్ ప్రకటించారు.