ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చార్లెస్ శోభరాజ్‌కు జగన్ఏ మాత్రం తీసిపోడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2024, 02:58 PM

అవినీతి సొమ్మును పంచుకోవటంలో జగన్, షర్మిల మధ్య వచ్చిన విభేదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం సంభంధమని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజ్‌కు ఏ మాత్రం తీసిపోని జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నేరమయ జీవితం ముగింపు కూడా అలానే ఉండబోతుందన్నారు. లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినందుకే 16 నెలలు జైల్లో జంటగా చిప్పకూడు తిన్న సంగతి జగన్ రెడ్డి, సాయిరెడ్డి మర్చిపోకూడదని కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.


కాగా ఆస్తుల మీద ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మరిచిపోయారని తన సోదరుడు వైఎస్‌ జగన్‌పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకు వచ్చారని ఆగ్రహించారు. అది చాలదన్నట్లుగా ఇప్పుడు కోర్టు వరకూ తీసుకువెళ్లారని విమర్శించారు. ఆస్తులు ఇచ్చేది లేదంటూ లేఖ రాయడంతోపాటు, తల్లిపైనా నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్టీ)లో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన సోదరి షర్మిల గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘కుటుంబ కలహాలు మామూలే’ అని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘కుటుంబాల్లో గొడవలు సాధారణమే అని జగన్‌ చెబుతున్నారు. కుటుంబ కలహాలు సామాన్యమేనంటూ తల్లిని, చెల్లిని కోర్టుకెందుకు ఈడ్చారు. ఇది సామాన్యమైన విషయం కాదు జగన్‌ సార్‌’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


తన అన్న జగన్మోహన్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మళ్లీ విరుచుకుపడ్డారు. స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషనాగుగా ఆయన్ను అభివర్ణించారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానికి కారణమైన కాంగ్రెస్‌, చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపారని.. జగన్‌ మళ్లీ సీఎం కాకూడదని ఆమె కంకణం కట్టుకున్నారని ఎంపీ విజయసాయురెడ్డి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై ఆమె ‘ఎక్స్‌’లో మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి మరణానికి చంద్రబాబే కారణమైతే.. ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా అని ఆయన్ను నిలదీశారు. ‘జగన్‌ ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయటపెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు? అనుమానం ఉండి.. ఐదేళ్లు అధికారంలో ఉండి.. ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా’ అని ధ్వజమెత్తారు. రాజశేఖర్‌రెడ్డి మరణానికి కాంగ్రెస్‌ ముమ్మాటికీ కారణం కాదన్నారు. కాంగ్రె్‌సను ఆయన రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారని.. బంగారు బాతును ఎవరూ చంపుకోరని.. సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరని స్పష్టం చేశారు.


వైఎస్‌ మరణం తర్వాత చార్జిషీటులో ఆయన పేరు చేర్పించింది జగన్‌ కాదా అని ప్రశ్నించారు. ‘కేసుల నుంచి బయటపడేందుకు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (సీనియర్‌ న్యాయవాది)తో కలసి ఈ కుట్ర చేయలేదా? కుట్ర చేయకపోతే జగన్‌ సీఎం అయిన వెంటనే అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పదవి ఆయనకు ఎందుకిచ్చారు’ అని దుయ్యబట్టారు. జగన్‌కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడినట్లు లేదని అన్నారు. ‘ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. బాబే కనిపిస్తున్నట్లుంది’ అని ఎద్దేవాచేశారు. బాబు కళ్లలో ఆనందం చూడడానికో.. ఆయన బ్రాండింగ్‌ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్‌ చేయడానికో పనిచేయాల్సిన అవసరం వైఎస్‌ బిడ్డకు ఎప్పటికీ రాదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com