ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబును ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు.. ఐదేళ్లూ మీరు గాడిదలు కాశారా? షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 07:38 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదంపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ షర్మిల.. వైఎస్ జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. తన బిడ్డలకు అన్యాయం చేస్తున్నారంటూ కంటతడి కూడా పెట్టుకున్నారు. అయితే షర్మిల చేసిన విమర్శలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వైఎస్ షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాకూడదనే ఉద్దేశంతోనే షర్మిల పనిచేస్తున్నారని.. ఆమెది ఆస్తి తగాదా కాదని.. అధికారం కోసం తగాదా అంటూ విమర్శించారు.


చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారన్న విజయసాయిరెడ్డి.. వైఎస్ జగన్ మీద మహిళల్లో వ్యతిరేకత రావాలని బాబుతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకుని వెళ్లారంటూ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ మరణానికి కారణమైన వ్యక్తులతో షర్మిల చేతులు కలుపుతున్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు మేలు కోసం సొంత అన్నను మోసం చేస్తున్న ఇలాంటి విషపు పామును ఎక్కడా చూడలేదంటూ ఆరోపించారు.


అయితే విజయసాయిరెడ్డి ఆరోపణలకు వైఎస్ షర్మిల కౌంటరిచ్చారు. ఎక్స్ వేదికగా స్పందించిన వైఎస్ షర్మిల ఘాటుగా బదులిచ్చారు. విజయసాయిరెడ్డి చదివింది.. జగన్ స్ర్కిప్ట్ అని పేర్కొన్న షర్మిల.. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న వైఎస్ఆర్ మ్యాండేట్ అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మోచేతి నీళ్లు తాగిన మీరు ఇంతకంటే ఎలా మాట్లాడుతారంటూ ప్రశ్నించారు. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదన్న షర్మిల.. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చింది రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. బంగారు బాతును ఎవరు చంపుకోరని.. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరని పేర్కొన్నారు.


వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణం అయితే మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదనీ.. దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు ? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా అంటూ షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్పించింది జగనేనన్న షర్మిల.. కేసుల నుంచి బయటపడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా అని ప్రశ్నించారు.


 "అలా చేయకపోతే జగన్ గారు సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు ? ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ గారు కాదా ? చంద్రబాబు గారితో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. వైఎస్ఆర్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబు గారిని పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి? జగన్ గారికి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది. చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్‌ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా" అని షర్మిల ట్వీట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com