ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇనుప ఖనిజం కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే‌కు ఏడేళ్ల జైలు.. రూ 44 కోట్ల భారీ జరిమానా!

national |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 07:16 PM

ఇనుప ఖనిజం అక్రమ మైనింగ్ కేసులో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సహా ఏడుగుర్ని దోషులుగా నిర్దారించింది ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఈ కేసులో ఆయనకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. ఖరారైంది. కర్ణాటకు చెందిన కార్వార ఎమ్మెల్యే సతీశ్‌ కృష్ణ శైల్‌ (కాంగ్రెస్‌) బేలెకేరి పోర్టు నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమ రవాణా ఆరోపణలపై ఎమ్మెల్యేతో పాటు మరో ఆరుగురిపై 2010లో కేసు నమోదయ్యింది. ఈ కేసులో అరెస్టైన ఆయన ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో ఉన్నారు.


తాజాగా, ఈ కేసు విచారణ పూర్తిచేసిన కర్ణాటక ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయూమర్తి సంతోష్ గజానన్ భట్.. శనివారం తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యే కృష్ణ శైల్‌‌ సహా ఏడుగుర్ని దోషులుగా నిర్దారించారు. దోషులకు మొత్తం రూ.44.11 కోట్ల జరిమానా విధించారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.9.60 కోట్ల జరిమానాను వేశారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించింది. ఉత్తర కన్నడ జిల్లా బెలేకేరీ పోర్టులో అధికారులు జప్తుచేసిన ఖనిజంలో 2009- 10 మధ్య 11,312 టన్నుల అక్రమంగా తరలించినట్టు నేరం రుజువయ్యిందని తెలిపారు. తాజా తీర్పుతో ఆయన శాసనసభ సభ్యత్వం కోల్పోనున్నారు. అయితే, ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని శైల్‌ తరఫు న్యాయవాది తెలిపారు.


ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ పోర్ట్స్ మహేశ్ బిలియా, ఖారాడపూడి మహేశ్, స్వస్తికా నాగరాజు, లాల్ మహల్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమాని ప్రేమ్ చంద్ గరగ్, మరో కంపెనీకి చెందిన డైరెక్టర్లు గోవిందరాజు, చేతన్ షా‌లను దోషులుగా తేల్చింది. పోర్ట్స్ డిప్యూటీ కన్జర్వేటర్ బిలియాకు అదనంగా మరో రూ.7.2 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో బెలెకెరి పోర్టు వద్ద 2010లో అటవీ శాఖ అధికారులు ఇనుక ఖనిజాన్ని జప్తు చేశారు. అందులో భారీ మొత్తం ఖనిజం చోరీకి గురయ్యింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టింది.


ఎమ్మెల్యే కృష్ణ శైల్‌ నడుపుతోన్న శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రయివేట్ లిమిటెడ్, లాల్ ఎక్స్‌పోర్ట్‌లపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే, జప్తుచేసిన ఇనుప ఖనిజం ఎగుమతిపై ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ఈ రెండు సంస్థలూ హైకోర్టును ఆశ్రయించాయి. సరైన పత్రాలను సమర్పించిన తర్వాతే ఖనిజాన్ని ఎగుమతి చేయాలని హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది. పోర్ట్ కన్జర్వేటర్ మహేష్ బిలియాతో కలిసి స్వాధీనం చేసుకున్న ఇనుప ఖనిజం స్టాక్‌ను వీరు అక్రమంగా ఎటువంటి పత్రాలు లేకుండా చైనాకు ఎగుమతి చేశారని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com