ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తుత్తి ఫ్యాక్టరీతో బ్యాంకుకు రూ.3 కోట్ల టోకరా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 04:40 PM

ఫ్యాక్టరీ ఏర్పాటు పేరుతో నకిలీ పత్రాలను సమర్పించి, బ్యాంకు నుంచి కోట్ల కాజేసిన కేటుగాళ్ల గుట్టురట్టయ్యింది. రెండేళ్ల కిందట బ్యాంకు నుంచి రూ.2.80 కోట్ల రుణం తీసుకుని, ఎటువంటి పరిశ్రమ ఏర్పాటుచేయలేదని గుర్తించారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకోగా.. నకిలీ పత్రాలతో బ్యాంకుకు టోకరా వేసిన నిందితులను క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడిని గతనెల 20న పోలీసులు అరెస్టు చేయగా.. మిగిలిన ముగ్గురిని విచారిస్తున్నట్లు సమాచారం. వీరికి బ్యాంకు అధికారుల కూడా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన అన్నపురెడ్డి హరినారాయణ.. రేణిగుంట మండలంలో లక్ష్మీనరసింహ ఇండస్ట్రీ ఏర్పాటుకు 2022లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు రుణం కోసం తిరుపతి బాలాజీ కాలనీ ఎస్బీఐ బ్రాంచ్‌‌‌ను సంప్రదించాడు. రుణం కోసం ష్యూరిటీగా తన ఆస్తి దస్తావేజులను సమర్పించాడు. నాటి బ్యాంకు మేనేజర్, విజిలెన్స్‌ అధికారి సహకారంతో రూ.2.80 కోట్ల మంజూరు చేయించుకున్నాడు.


కానీ, తీసుకున్న అప్పును ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు. నెల నెలల వాయిదాలు కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. అయినా స్పందన లేకపోవడంతో చివరకు పరిశ్రమ వద్దకు వెళ్లగా అక్కడ పరిస్థితి చూసి షాకయ్యారు. పరిశ్రమగా చెప్పిప భవనం మూసివేయడంతోపాటు అందులో తప్పుపట్టి పాడైన యంత్రాలు, పరికరాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, బ్యాంకు గ్యారంటీ కోసం సమర్పించిన ఆస్తి పత్రాలు కూడా నకిలీవని తేలడంతో అవాక్కవడం అదికారుల వంతయ్యింది.


చిలకలూరిపేటకు చెందిన ములుగు బ్రహ్మానందం, నరసరావుపేటకు చెందిన కడియాల వెంకట్రావు అనే ఇద్దరు వ్యక్తులు సమర్పించిన ఆస్తి పత్రాలు నకిలీవిగా గుర్తించి 2024 జనవరిలో తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిని క్రైమ్‌ బ్రాంచ్ స్టేషన్‌కు బదిలీ చేయడంతో ఆ విభాగం దర్యాప్తు చేపట్టింది. గత నెలలో ప్రధాన నిందితుడు హరినారాయణను పోలీసులు అరెస్టు చేశారు. కడియాల వెంకట్రావు, ములుగు బ్రహ్మానందంతోపాటు అన్నపురెడ్డి శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com