సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను అలహాబాద్ విమానాశ్రయం వద్ద అడ్డుకోవడంపై బీఎస్పీ చీఫ్ మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ‘‘ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు’’ చెక్ పెట్టేందుకు తాము ఒక్కతాటి మీదికి రావడంతో ఆ పార్టీ వణికిపోతోందని ఆమె పేర్కొన్నారు. ‘‘బీజేపీ నియంతృత్వ పాలనకు ఇదే నిదర్శనం. ఇలాంటి దురదృష్టకరమైన, అప్రజాస్వామికమైన చర్యలపై పూర్తిస్థాయిలో పోరాడతాం. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు చెక్ పెట్టేందుకు ఎస్పీ-బీఎస్పీలు జట్టుకట్టాయి. దీంతో ఆ పార్టీకి భయం పట్టుకుంది. అందుకే మా రాజకీయ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది...’’ అని పేర్కొన్నారు. అలహాబాద్ యూనివర్సిటీలో ఓ విద్యార్ధి నేత ప్రమాణ స్వీకారానికి వెళ్తుండగా పోలీసులు తనను అడ్డుకున్నారంటూ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. పోలీసులు తనను విమానాశ్రయంలోకి తోసుకుంటూ వెనక్కి తీసుకెళ్తున్న ఫోటోలను కూడా ఆయన ట్వీటర్లో పోస్టు చేశారు.