ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశ్నిస్తే వారి స్వరం వినపడకుండా చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 04:59 PM

ముఖ్యమంత్రి చంద్రబాబుపై  మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్  మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఐదు నెలల పాలనలో డీబీటీ అనేది ఎక్కడ కనపడదని.. దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే కనిపించేదంటూ వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్‌ లేదు.... సూపర్ సెవన్ లేదంటూ ఎద్దేవా చేశారు. కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఓటు అన్ అకౌంట్‌తో ఇంత కాలం నడిచే ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేదంటూ ఎద్దేవా చేశారు. ఇసుక, మద్యం,పేకాట క్లబ్బులు ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా కనిపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేకు, సీఎంకు ఇంత అంటూ కప్పం కట్టకుండా ఏ పని చేయలేని పరిస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు.


ఎన్నికల సమయంలో అబద్దాలకు రెక్కలు కడతారని... ప్రజల ఆశలతో చెలగాటం ఆడతారని మండిపడ్డారు. ‘‘అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితిలో ఉంది... చేయాలని ఉన్నా... చేయలేకపోతున్న అని అంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి స్వరం వినపడకుండా చేస్తారు. మార్పు పేరుతో స్కాంలకు తెరలేపుతారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకకు సంబంధించి దారుణమైన స్కెచ్‌లు గీశారన్నారు. 141 నియోజకవర్గాలలో లారీ ఇసుక రూ.20వేలు ఉందన్నారు. ముప్పై నియోజకవర్గాల్లో ముప్పైవేల పైనే ఉందన్నారు. గత ప్రభుత్వం కన్నా రెండు, మూడు రెట్లు ఇసుక రేట్లు పెరిగాయన్నారు. అధికారంలోకి రాగానే లెఫ్ట్ రైట్ దోచేశారని ఆరోపించారు. దసరా పండుగలో అందరూ నిమగ్నమై ఉంటే... రెండు రోజుల్లో 108 రీచ్‌లకు టెండర్ పిలిచారన్నారు. ‘‘ఎవరైనా ఎప్పుడైనా ఇలా చేయడం చూశారా.. ఒక మాఫీయా తయారు అవ్వడం... ప్రభుత్వం దగ్గర ఉండి తమ వారి చేత దోపిడీ చేయించడం. ఆ తరువాత నీకు ఇంత... నాకు ఇంత అని పంచుకోవడం. 2014 నుంచి 2019 వరకు ఇదే పద్ధతి అమలు చేశారు. బీజేపీతో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి నిస్సిగ్గుగా దోపిడీ చేస్తున్నారు. వైసీపీ హయంలో కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్ ఫాం మీద ఈ టెండర్లు పిలిచాం. పేరుకు మాత్రమే ఉచిత ఇసుక...ఎవరికి ఉచిత ఇసుక ఇస్తున్నారు. గతంలో వున్న రేటు కన్నా రెండు, మూడు రెట్లు ఎక్కువ రేటుకు ఇసుక అమ్ముతున్నారు’’ అంటూ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com