ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దూసుకొస్తున్న వాయుగుండం.. ఆ జిల్లాలకు ఆకస్మిక "వరదల గండం"

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2024, 07:30 PM

వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీవాసులకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో కొన్ని జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా దూసుకొస్తున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.


భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్.. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం ఆరు జిల్లాలకు కోటి రూపాయల చొప్పున అత్యవసర నిధులు కూడా విడుదల చేసింది. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలు, నెల్లూరులో ఆరు మండలాలు, అన్నమయ్య జిల్లాలోని మూడు మండలాలపై ఎక్కువ ప్రభావం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.


మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పనులకు వెళ్లలేకే రోజువారీ కూలీలు, కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు ఇదే పరిస్థితి కొనసాగితే వరద ముప్పు తప్పదని భయంతో తీరప్రాంత వాసులు ఉన్నారు. అటు మత్స్యకారులు సైతం ఇళ్లకు పరిమితమయ్యారు. తుపాను నేపథ్యంలో సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. దీంతో వీరంతా ఇంటికే పరిమితమైన పరిస్థితి. అటు ముహూర్తాల సమయం కూడా కావటంతో శుభకార్యాలకు కూడా వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com