ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీని గద్దె దింపే దాకా నేను చనిపోను.. మాట్లాడలేకపోతున్నా క్షమించండి.. ఖర్గే

national |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 10:53 PM

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే.. ఆదివారం కథువా జిల్లాలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ప్రసంగిస్తున్న సమయంలో ఖర్గే కాస్త అనారోగ్యానికి గురయ్యారు. ప్రసంగిస్తున్న సమయంలోనే కళ్లు తిరిగి కిందపడబోయారు. అయితే పక్కనున్న నేతలు వెంటనే అలర్ట్ అయ్యారు. ఖర్గేను కిందపడనీయకుండా పట్టుకున్నారు. కుర్చీలో కూర్చోబెట్టారు. మంచినీళ్లు తాగించారు. అయితే కొద్దిసేపటి తర్వాత వైద్యులు వచ్చి మల్లిఖార్జున ఖర్గేను పరీక్షించారు. వైద్య పరీక్షల్లో బీపీ కాస్త కంట్రోల్ తప్పడంతోనే ఆయన కిందపడబోయినట్లు తెలిసింది.


అయితే అస్వస్థతకు గురైనప్పటికీ ఖర్గే తన ప్రసంగాన్ని ఆపలేదు. కాంగ్రెస్ నాయకుల మద్దతుతో మల్లిఖార్జున ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ నేతలు సపోర్ట్‌గా సాయం అందించడంతో లేచి నిలబడిన ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన అస్వస్థత విషయాన్ని ప్రస్తావిస్తూనే కేంద్రం మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అధికారం నుంచి కిందకు దించే వరకూ తాను చనిపోనంటూ మల్లిఖార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే వరకూ మనం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తనకు 83 ఏళ్లు వయసు అని.. ఇప్పుడప్పుడే తాను చనిపోనంటూ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దింపేవరకూ తాను బతికే ఉంటానని అన్నారు.


అయితే ఇంకా చాలా మాట్లాడాలని ఉందని.. కానీ కళ్లు తిరుగుతూ ఉండటంతోనే మాట్లాడలేకపోతున్నానని కార్యకర్తలకు మల్లిఖార్జున ఖర్గే క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఖర్గే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బీపీ తగ్గిపోవటంతోనే అలా జరిగినట్లు తెలిపాయి. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించాయి. మరోవైపు జమ్ముకశ్మీర్ శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి విడత పోలింగ్ అక్టోబర్ ఒకటో తేదీ జరగనుంది. దీంతో ప్రచారానికి ఇవాళే ఆఖరి రోజు. దీంతో అన్ని పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తించాయి. మరోవైపు 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జమ్ములోని 11 సీట్లు, కథువా జిల్లాలోని ఆరు సీట్లు, సాంబాలోని మూడు, ఉదమ్‌పూర్‌ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే కశ్మీర్ లోయలోని బారాముల్లా, కుప్వారా జిల్లాలలో ఉన్న 16 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com