ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీక్షలో ఉన్న వారు ఎవరైనా పాదరక్షలు ధరిస్తారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 10:38 PM

టీటీడీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించిన సీఎం చంద్రబాబు, దానిపై ఆధారాలుంటే కేసు పెట్టాలి కానీ, ఇలా ‘సిట్‌’ పేరుతో హడావిడి ఎందుకు చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. అతి పవిత్రమైన టీటీడీ లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని, అందుకు ఆయనకు ఎప్పటికైనా పరిహారం తప్పదని స్పష్టం చేశారు. తన దుష్ప్రచారం బెడిసి కొట్టడంతో, యథావిథిగా యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని వెల్లంపల్లి ఆక్షేపించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. 


చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తన ఆరోపణలపై అత్యున్నత స్థాయి విచారణ కోరాలన్న, మాజీ మంత్రి.. ఒకవేళ అవి తప్పుడు ఆరోపణలని తేలితే ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పారు. నిజానికి చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు టీటీడీకీ కల్తీ నెయ్యి సరఫరా జరిగినా, పరీక్షల్లో ఆ విషయం తేలినా.. అదంతా తమ ప్రభుత్వం వచ్చాకే అన్న విషయాన్ని ఆయన మర్చిపోయారని వెల్లంపల్లి పేర్కొన్నారు. చెన్నై డెయిరీ నుంచి జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో నాణ్యత లేదని తేలడంతో, వాటిని వెనక్కి పంపామని టీటీడీ ఈఓ ప్రకటించగా, ఆ నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావించిన మాజీ మంత్రి, రెండింటికీ పొంతన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రెండు అడుగులు ముందుకేసి హిందూ సనాతన ధర్మాన్ని తాను కనుగొన్నట్లు చెబుతున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి ఆక్షేపించారు. అసలు దీక్షలో ఉన్న వారు ఎవరైనా పాదరక్షలు ధరిస్తారా? సినిమాలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారన్న ఆయన, టీటీడీ లడ్డూల తయారీపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టే, పవన్‌కళ్యాణ్‌ ఆ దీక్ష చేస్తున్నారని అన్నారు.విజయవాడ వరదల్లో ముందుగా ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ, ఆ తర్వాత సహాయక చర్యల్లోనూ సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి ఆక్షేపించారు. విజయవాడ వరదల సాకు చూపి వందల కోట్ల చందాలు వసూలు చేశారన్న ఆయన, ఆ నిధులు ఖర్చు చేయలేదని ఆరోపించారు. వరద బాధితులను ప్రభుత్వం ఏ వి«ధంగానూ ఆదుకోలేదని చెప్పారు. నష్ట పరిహారం, ఆహారం కోరుతూ కుమ్మరిపాలెం వాసులు రోడ్డెక్కితే పోలీసులతో కొట్టించారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.వరద బాధితులకు ప్రకటించిన సాయాన్ని కూడా సరైన ఎన్యుమరేషన్‌ లేకుండానే పంచేశారని విమర్శించారు. ఇందుకు చంద్రబాబు అటు దైవాగ్రహానికి, ఇటు ప్రజాగ్రహానికి గురి కాక తప్పుదని ఆయన హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com