ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, విచారణ జరిపించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 10:35 PM

ప్రజల అవసరాలు, సమస్యలు గుర్తించి అందుకు అనుగుణంగా పని చేయాల్సిన సీఎం చంద్రబాబు, ‘జాదూగర్‌’లా డైవర్షన్‌ పాలిటిక్స్‌తో టైం పాస్‌ చేస్తున్నారని మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆక్షేపించారు. చంద్రబాబు వంద రోజుల పాలనంతా వైఫల్యాలే అన్న ఆయన, దాన్ని డైవర్ట్‌ చేసేందుకు టీటీడీ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు చేశారని, అది బెడిసి కొట్టడంతో, మళ్లీ డైవర్ట్‌ చేస్తూ, జగన్‌గారి తిరుపతి పర్యటనపై రాద్దాంతం చేశారని వెల్లడించారు. చంద్రబాబు తాను చేసిన ఆరోపణకు కట్టుబడి ఉంటే, నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, విచారణ కోరాలని.. అది కూడా సుప్రీంకోర్టు పరిధిలో జరగాలని స్పష్టం చేశారు. దానికి భయçపడిన చంద్రబాబు, తాను సొంతంగా నియమించిన ‘సిట్‌’ దర్యాప్తు పేరుతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.


విశాఖపట్నంలో  మాజీ మంత్రి, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందన్న మాజీ మంత్రి, నిత్యావసరాల ధరలు దారుణంగా మండుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు మండే ధరల కన్నా, ఉద్యోగుల బదిలీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. కనీసం లిక్కర్‌ పాలసీపై ఉన్న శ్రద్ద కూడా ప్రభుత్వానికి స్టీల్‌ ప్లాంట్‌పై లేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ఆర్‌సీపీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా హత్యలు, హత్యా యత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం కొనసాగిస్తోందని విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న వైయస్ఆర్‌సీపీ కార్యాలయాన్ని కూల్చడంతో, ఆ దౌర్జన్యకాండ మొదలైందని గుర్తు చేశారు.ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, దానికి గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం, జగన్‌గారే కారణమంటూ నిందించడం.. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు డయేరియాతో ఆస్పత్రులు పాలవుతున్నా, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో హిడెన్‌ కెమెరాలపై విద్యార్థినిలు ఎంత ఆందోళన చేసినా, నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నా, ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నా.. పట్టించుకోకపోవడం కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని గుడివాడ అమర్‌నాథ్‌ దుయ్యబట్టారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తూ, 4వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపు చేపట్టినా, అభ్యంతరం చెప్పని కూటమి ప్రభుత్వం, దాన్ని డైవర్ట్‌ చేసేందుకు కూడా టీటీడీ లడ్డూల్లో కల్తీ నెయ్యి అంటూ దుష్ప్రచారం చేసిందని మాజీ మంత్రి అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని మంత్రి లోకేష్‌ చెప్పినంత మాత్రాన, అది ఆగిపోదని, కేంద్రానికి టీడీపీ మద్దత ఉపసంహరిస్తేనే అది సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com