ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాపిల్ సంస్థకు కాకినాడ కన్జ్యూమర్ కోర్టు రూ.లక్ష జరిమానా.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 07:26 PM

దిగ్గజ సంస్థ, ఐఫోన్ ఉత్పత్తి కంపెనీ యాపిల్‌కు కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఐఫోన్‌ కొనుగోలు చేస్తే ఇయర్‌ పాడ్స్‌ ఫ్రీగా ఇస్తామని ప్రకటన చూసి తాను మోసపోయాయని ఓ యువకుడు యాపిల్‌‌పై మూడేళ్ల కిందట ఫిర్యాదు చేశాడు. ఫోన్ కొంటే తనకు ఇయర్‌ పాడ్స్‌ ఇవ్వలేని అతడు ఆరోపించాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్.. యాపిల్‌ సంస్థకు రూ.లక్ష జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించింది. అయితే, ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి చెల్లించాలని ఆదేశించింది.


దీంతో పాటు అదనంగా బాధితుడికి కూడా కొంత మొత్తం చెల్లించాలని పేర్కొంది. రూ.14,900 విలువైన ఇయర్‌ పాడ్స్‌ లేదా ఆ మేరకు నగదు, మానసిక క్షోభకు గురిచేసినందుకు అతడికి రూ.10 వేలు, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశాలు వెలువరించింది. వినియోగదారుల కమిషన్‌ సభ్యురాలు చెక్కా సుశీ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నగరంలోని సూర్యారావుపేటకు చెందిన చందలాడ పద్మరాజు అనే వ్యక్తి మూడేళ్ల కిందట ఆన్‌లైన్‌‌లో యాపిల్ సంస్థ యాడ్ చేసి ఐ-ఫోన్ కొనుగోలు చేశాడు.


అక్టోబరు 13, 2021న యాపిల్‌ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి రూ.85,800 పెట్టి ఫోన్‌ ఆర్డర్ చేశాడు. ఆ సమయంలో ఫోన్‌ కొంటే రూ.14,900 విలువైన ఇయర్‌ పాడ్స్‌ ఉచితంగా అందిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్‌ వచ్చినా.. ఇయర్‌ పాడ్స్‌ పంపలేదు. ఈ నేపథ్యంలో యాపిల్‌ సంస్థ ప్రతినిధులు, కస్టమర్‌ కేర్‌లను ఆన్‌లైన్‌లో సంప్రదించాడు. అయినా వారి నుంచి స్పందన లేకపోవడంతో బాధితుడు ఫిబ్రవరి 15, 2022న వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.


ఫోన్ కొంటే ఇయర్ పాడ్స్ ఇస్తామని ప్రకటనలో పేర్కొన్నారని, కానీ, కేవలం తనకు మొబైల్ మాత్రమే పంపారని తెలిపాడు. ఆ ప్రకటనకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించాడు. యాపిల్ సంస్థను ప్రతివాదిగా చేర్చడంతో ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కమిషన్‌ ఛైర్మన్ చెరుకూరి రఘుపతి వసంతకుమార్, సభ్యులు చెక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావులు బాధితుడికి అనుకూలంగా తీర్పు వెల్లడించారు. ముంబయి కేంద్రంగా సేవలు అందిస్తోన్న యాపిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు జరిమానా విధిస్తూ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com