మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ నానిపై కోర్టు ఆదేశాలతో పోలీసులు చీటింగ్ కేసు నమోదుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో గాయపడిన తనకు వైద్య ఖర్చుల భరిస్తానని ఆళ్ల నాని హామీ ఇచ్చారని, కానీ తర్వాత తమ గురించి పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీకి చెందిన నాగమణి అనే మహిళ ఆరోపించారు. బీమా వచ్చేలా చూస్తానని, తమ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి మోసం చేశారని ఆరోపిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఆళ్ల నాని, మరో ఏడుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్ని కల సమయంలో ఏలూరు నియోజకవర్గం పరిధిలో ఆళ్ల నాని ప్రచారం నిర్వహించారు. శాంతినగర్లో లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్టుమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు దిరిశాల వరప్రసాద్ తదితరులతో కలిసి అదే ప్రాంతానికి అవుటుపల్లి నాగమణి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. 4వ అంతస్తులో ప్రచారం ముగించుకొని వారంతా కిందకు దిగేందుకు లిఫ్ట్ ఎక్కారు.. ఆ సమయంలో లిఫ్ట్ ఫెయిల్ అయి కిందకు జారిపడటంతో అందులోని ఉన్నవారు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ క్రమంలో గాయపడిన నాగమణిని చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రి తరలించారు. ఆమె వాలంటీర్ కాగా.. సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనడంతో ఎన్నికల సంఘంతో ఇబ్బందులు వస్తాయనే బయటకు పొక్కనీయలేదు.
బాధితురాలు నాగమణి వైద్యానికి అయ్యే ఖర్చులు తాను భరిస్తానని, ప్రమాద బీమా వచ్చేలా చేస్తాని మాజీ డిప్యూటీ సీఎం మాటిచ్చారు. ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పట్లో ఆళ్ల నాని హామీ ఇచ్చినా.. ఆ తరువాత పట్టించుకోలేదు. నష్టపరిహారం కూడా రాకపోవడంతో బాధితురాలు నిలదీస్తే.. కొందరు నాయకులు ఆమెను బెదిరించారు. తనను ఆదుకోకపోగా.. బెదిరింపులకు దిగడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు త్రీటౌన్ పోలీసులు శనివారం రాత్రి ఆళ్ల నాని, దిరిశాల వరప్రసాద్, సుధీరా బాబు, జీలూ ఖాన్, కురెళ్ల రాంప్రసాద్తో పాటు వైద్యులు సునీల్ సందీప్, లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ ప్రెసిడెంట్, సెక్రటరీల తదితరులపై కేసు నమోదు చేశారు.