ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిహారం కోసం 42 ఏళ్లు న్యాయ పోరాటం.. ప్రభుత్వంపై వృద్ధుడు విజయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 07:18 PM

భూసేకరణ కింద తన భూమిని తీసుకుని పరిహారం చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వంపై సుదీర్ఘ న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు ఓ వ్యక్తి. ఆయన ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు దశాబ్దాలకుపైగా పోరాడి గెలిచిన 81 ఏళ్ల వృద్ధుడి విజయ ప్రస్థానం ఇది. ప్రస్తుతం కదలలేని స్థితిలో మంచానికే పరిమితమైన అతడు.. కోర్టు ద్వారా తన హక్కును సాధించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడకు చెందిన ఓలేటి వెంకట నారాయణ (81) కు 87 సెంట్ల భూమి ఉండేది. 1982లో ఆ భూమిని ఉప్పుటేరు డ్రెయిన్‌ పనుల కోసం అధికారులు భూసేకరణ చట్టం కింద స్వాధీనం చేసుకున్నారు.


ఈ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన బాధితులు అప్పట్లోనే న్యాయస్థానాలను ఆశ్రయించి.. ఎకరాకు రూ.5,002.50 చొప్పున పరిహారం పొందారు. కానీ, వెంకట నారాయణకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. దీంతో ఆయన 2009లో హైకోర్టుకు వెళ్లి.. తన భూమి తీసుకున్నందుకు పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. అతడి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. 2023 జూన్‌లో తీర్పు వెలువరించారు. ఎకరాకు రూ. 5,003 చొప్పున 6% వడ్డీతో లెక్కించి పరిహారం చెల్లించాలని ఆదేశించారు.


కానీ, 2013లో అమల్లోకి వచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో ఈ తీర్పుపై అప్పీల్‌‌కు వెళ్లగా.. డివిజన్ బెంజ్ విచారణ చేపట్టింది. ఇటీవల జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు, జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌తో కూడిన ధర్మాసనం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని తీర్పు చెప్పింది. 87 సెంట్లకు ప్రస్తుత మార్కెట్‌ ధరను నిర్ణయించి నాలుగు నెలల్లో చెల్లించాలని అధికారులను ఆదేశించింది. అలాగే, వెంకట నారాయణకు అప్పట్లో ఇవ్వాల్సిన రూ.5,003 పరిహారంతో పాటు, భూమిని స్వాధీనం చేసుకున్న 1982 ఫిబ్రవరి 16 నుంచి 9% వడ్డీతో 3 వారాల్లో చెల్లించాలని ఈ మేరకు సెప్టెంబరు 25న వెలువరించిన తీర్పులో స్పష్టం చేశారు.


బాధితుడికి పరిహారం చెల్లింపులో చోటుచేసుకున్న జాప్యాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోలేని లక్షల మందిలో ఈ రైతు కూడా ఒకరని అభిప్రాయపడింది. సముచితమైన పరిహారం పొందేందుకు ఆయనకు ఉన్న హక్కును తోసిపుచ్చలేమని తేల్చిచెప్పింది. వయోభారంతో ప్రస్తుతం మంచంపై ఉన్న అతడికి ఈ పరిహారం, మద్దతు ఎంతో అవసరమని వ్యాఖ్యానించింది. భూ సేకరణ వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదే అయినా... యజమానికి పరిహారం చెల్లించకుండా ఆస్తులను స్వాధీనం చేసుకోలేరని ధర్మాసనం ఉద్ఘాటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com