ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద సాయం అందని వారికి ,,,నేరుగా అందించనున్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 07:00 PM

ఏపీలో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడినవారికి ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటికే వరద సాయం ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం.. ఇటీవల బాధితుల అకౌంట్లలోకి నగదు కూడా విడుదల చేసింది. అయితే ఇంకా వరద సాయం అందని వారి కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల కారణంగా నాలుగు లక్షల మంది ప్రభావితులు అయ్యారనే అంచనాతో ఏపీ ప్రభుత్వం రూ.602 కోట్ల రూపాయలు బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేసిన సంగతి తెలిసిందే. సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం కొంత మంది లబ్ధిదారుల చేతికి వరద పరిహారం చెక్కులు అందించారు. అయితే బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవటం, ఇతరత్రా సాంకేతిక అంశాల కారణంగా కొంతమందికి వరద సాయం అందలేదు. అలాంటి వరద బాధితులకు నేరుగా పరిహారం పంపిణీ చేయనున్నారు.


సోమవారం విజయవాడ కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పరిహారం పంపిణీ చేస్తారు. ఇప్పటి వరకూ రూ.569 కోట్లు బాధితుల ఖాతాల్లో జమచేశారు. మిగతా వారికి రేపు నేరుగా పరిహారం అందించనున్నారు. అలాగే వరద సాయంలో భాగస్వాములైన వారిని చంద్రబాబు సన్మానించనున్నారు. అనంతరం వారితో భేటీ కానున్న చంద్రబాబు.. ధన్యవాదాలు తెలియజేయనున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన చంద్రబాబు వరద బాధితులకు పరిహారం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. అయితే కొన్ని కారణాల వలన కొంతమందికి పరిహారం అందలేదని గుర్తించిన ప్రభుత్వం వారికి.. నేరుగా అందించనుంది. ఏదేమైనా సెప్టెంబర్ 30వ తేదీ లోగా వరద బాధితులు అందరికీ పరిహారం అందించాలని అధికారులకు చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు.


ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో సంభవించిన వరదల కారణంగా ఏపీలో పదుల సంఖ్యలో చనిపోయారు. వందల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. ఇళ్లు నీటమునిగి వేలమంది రోడ్డునపడ్డారు. వారందరికీ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించింది ప్రభుత్వం. వేలసంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. మొత్తంగా రూ.6882 కోట్లు వరద నష్టం జరిగిందని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రాథమిక నివేదిక సమర్పించింది. అయితే బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు. అందులో భాగంగానే బాధితులకు పరిహారం పంపిణీ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com