ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 8 స్క్రీన్ల మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్లు.. లులు గ్రూప్ ఛైర్మన్ ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 06:55 PM

ఆంధ్రప్రదేశ్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ ట్వీట్ చేశారు. శనివారం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ.. తమకు సాదర స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబాబుతో తనకు 18 ఏళ్ల అనుబంధం ఉందన్న లులూ గ్రూప్ ఛైర్మన్.. శనివారం సీఎంతో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు తెలిపారు. విశాఖపట్నంలో 8 స్ర్కీన్ల ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ సహా అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు లులూ గ్రూప్ ఛైర్మన్ తెలిపారు. అలాగే విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కె్ట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్‌లను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ట్వీట్ చేశారు.


మరోవైపు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీతో రెండు గంటలపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశాన్ని చర్చించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టే విషయంపైనా చర్చలు జరిగాయి. అనంతరం ఆదివారం ఉదయం ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని.. విశాఖలో లులు షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, తిరుపతి, విజయవాడలో హైపర్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామని లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ ప్రకటించారు.


మరోవైపు గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ముందుకు వచ్చింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలో మాల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు లులు గ్రూప్ ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.2,200 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఈ ఒప్పందం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం దీనికి శంకుస్థాపన చేశారు. అయితే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక లులు గ్రూప్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ప్రభుత్వం ఈ ఎంవోయూను రద్దు చేసుకుంది. దీంతో పాటు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంది. అయితే టీడీపీ మరోసారి అధికారంలోకి రావటం.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో లులు గ్రూప్ ఏపీకి తిరిగి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com