ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం.. త్వరలోనే విధివిధానాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 06:46 PM

ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి హామీలను అమలు చేసిన ఏపీ ప్రభుత్వం.. వచ్చే దీపావళి నుంచి మరో పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మహాశక్తి పథకంలో భాగంగా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని స్వయానా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.


మరోవైపు ప్రస్తుతం విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర రూ.825.50 గా ఉంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తే.. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2,476.50 ప్రయోజనం లభిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటీ 55 లక్షలకుపైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరికి అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తే.. ఏడాదికి రూ.3,640 కోట్లు కావాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలిండర్ రేటు ప్రకారమే ఈ లెక్కలు వేశారు. ఒకవేళ గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే ఆ మొత్తం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ 1.55 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లలో.. రాష్ట్ర ప్రభుత్వం పథకమైన దీపం, కేంద్ర పథకమైన ఉజ్వల పథకంతో పాటుగా ఇతర పథకాల కింద 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒకవేళ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వీరికి మాత్రమే పరిమితం చేస్తే.. ఏడాదికి రూ.1,763 కోట్లు ఖర్చు అవుతుంది.


ఇదే సమయంలో దీపం పథకాన్ని కూడా ఉజ్వల పథకంలో చేర్చుకోవాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై కాస్త భారం తగ్గుతుంది. దీపం పథకాన్ని ఉజ్వల కిందకు చేర్చితే.. 65 లక్షల కనెక్షన్లు ఉజ్వల పథకం కిందకు వస్తాయి. ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్రం సిలిండర్ మీద రూ.300 రాయితీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో దీపం పథకాన్ని ఉజ్వల కిందకు చేర్చితే.. ఏపీకి ఏడాదికి రూ.585 కోట్ల వరకూ ఆదా అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలను అన్నింటి మీద పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం జరుపుతోంది. ఈ అధ్యయనం ఆధారంగా నివేదిక తయారు చేసి మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయనుంది. ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com